white-tiger1

ఇంకో పది పదిహేను సంవత్సరాల్లో అమెరికా ప్రపంచాధిపత్యానికి తెరపడుతుందని, అమెరికానంతర ప్రపంచానికి నాయకత్వం వహించగలిగే అవకాశం వున్న దేశాలు ఇండియా, చైనాలేనని ఈరోజుల్లో తరచు వినిపించే వాదం. పదేళ్ల క్రితం ఇండియాకి ఇవాల్టి ఇండియాకి పోలికే లేదు. రోడ్ల నిండా హోండా, టయోటా కార్లు, షాపింగ్‌ మాల్‌లు, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు, కొత్త కొత్త వ్యాపార అవకాశాలు, లక్షల్లో జీతాలూ, రెండంకెలకి దగ్గరలో దేశ వృద్ధి రేటు, ఇలాంటి విషయాలు విన్నప్పుడు, ఓహో, ఇంత తక్కువకాలంలో ఎంత ‘అభివృద్ధి’ అని భ్రమ కలుగుతుంది.

ఆ వెలుగులో కళ్లు బైర్లు కమ్ముకోకుండా నిలబడి, దాని వెనక వున్న అసౌకర్యమైన చీకటిని గుర్తించడానికీ, ఆ చీకట్లో వుండే మనుషుల జీవితాలపట్ల సానుభూతితో కథలు రాయడానికి చాలా నిజాయితి, ధైర్యం వుండాలి. అవన్నీ వున్న రచన అరవింద్‌ అడిగ నవల వైట్‌ టైగర్‌. ఇది అరవింద్‌ మొదటి నవల. అద్భుతమైన శైలి, ఆసక్తికరంగా సాగే కథనం, గొప్ప వస్తువు వున్న ఈ నవలకి 2008 మాన్‌ బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. కథ విషయానికి వస్తే, గయ దగ్గర లక్ష్మణ్‌ గార్హ్‌ అనే కుగ్రామంలో రిక్షాకార్మికుడి కొడుకు బలరాం ఇందులో ప్రధాన పాత్ర. తల్లి అతని చిన్నతనంలోనే మరణిస్తుంది.

 

ఇంట్లో ముసలావిడ బలరాంని బడి మానిపించమని ఒత్తిడి తెచ్చినా, తాను బతికున్నంతవరకూ బలరాం చదువుకునేలా చూస్తాడు తండ్రి, అతని ఒకేఒక కోరిక బలరాం అయినా చదువుకుని బాగా బతకాలన్నదే. చాలా పిరికివాడైనా, బడిలో మిగతా పిల్లలకన్నా తెలివైనవాడు బలరాం. అయినా తండ్రి చనిపోయిన తరువాత కుటుంబ ప్రతికూలతవల్ల అన్నలాగే టీ కొట్లో పనికి చేరి, తరవాత డ్రైవింగ్‌ నేర్చుకుని వాళ్ల గ్రామంలోనుంచి నక్సలైట్ల భయంతో టౌనుకు తరలివెళ్లిన భూస్వామి కొడుకుల దగ్గర డ్రైవరుగా-నౌకరుగా కుదురుతాడు.

గ్రామాలు వదిలివెళ్లిన భూస్వాములు టౌన్‌లో ఈ అభివృద్ధి ఫలితాలు అనుభవిస్తూ బొగ్గు వ్యాపారంలో కోట్లు సంపాదిస్తూ వుంటారు. ఆ వ్యాపారాల్లో వచ్చిన అక్రమ ఆర్జనలని కాపాడుకోవడానికి వాళ్లకి స్థానికంగా కిందతరగతులనుంచి ఎదిగిన లుంపెన్‌ ‘సోషలిస్టు’ నాయకుల సహాయం వుంటుంది. ఆ భూస్వామి రెండో కొడుకు అశోక్‌ అమెరికాలో చదువుకుని, అక్కడే తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా ‘పింకీ మేడమ్‌’ అనే క్రిస్టియన్ని పెళ్లి చేసుకుని ఇండియాకి వస్తాడు. ఆయనకోసం కొన్న కొత్త హోండా సిటీ కారుకి రామ్‌ప్రసాద్‌ అనే పాత డ్రైవరు వుంటాడు. బలరాం అక్కడ రెండో డ్రైవరుగా చేరుతాడు. రాజకీయ అవసరాలకోసం అశోక్‌ ఢిల్లీ వెళ్లేటప్పుడు, బలరాం రామ్‌ ప్రసాద్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసి అతని బదులు ఢిల్లీకి చేరుతాడు.

అక్కడ ఒకరోజు పింకీ మేడమ్‌ తప్పతాగి రోడ్డుమీద వున్న ఒక పేదపిల్లమీద కారు ఎక్కించేస్తే, ఆ నేరం తాను చేసినట్టుగా ఒప్పుకొని జైలుకు వెళ్లవలసిన ఒత్తిడులకి తలొగ్గుతాడు బలరాం. అయితే ఆ అవసరం రాదు. చాలా సాధువని, మంచివాడని భావించిన అశోక్‌ నిజరూపం కొంత అర్థమవుతుంది. మహానగరాల్లో డబ్బుతో కొనగలిగిన సుఖాలు తెలుస్తాయి. యజమానులకోసం ఎదురుచూసే డ్రైవర్లు కాలం గడపడంకోసం చదివే హత్యల వారపత్రికలు, ఢిల్లీలో పాత పుస్తకాల రోడ్డుమీద రూమీ, ఇక్బాల్‌, మిర్జాగాలీబు కవితలు పరిచయం అవుతాయి. నువ్వు ఏళ్ల తరబడి తాళం చేతులకోసం వెతుకుతున్నావు కానీ తలుపు ఎప్పుడూ తెరిచే వుంది అన్న ఉర్దూ కవి కవితతో జ్ఞానోదయం అవుతుంది.

ఒకరోజు రాజకీయనాయకుడికి లంచం యివ్వడానికి డబ్బు తీసుకెళ్తున్న అశోక్‌ని చంపి, ఆ ఏడు లక్షల డబ్బుతో బెంగుళూరు పరారీ అయ్యి అక్కడ కాల్‌ సెంటర్లలో పనిచేసే వాళ్లని రవాణా కాంట్రాక్ట్‌లు సంపాదించి, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారతాడు. ఈ కథంతా బలరాం బెంగుళూరు వస్తున్న చైనా అధ్యక్షుడు వెన్‌ జియా బావ్‌ కి రాసిన వుత్తరం ద్వారా తెలుస్తుంది. ఉన్నవాళ్లకి లేనివాళ్లకి మధ్య పెరుగుతున్న అంతరాలు, ఆ అంతరాల వల్ల అనివార్యంగా పెరుగుతుండే నేర ప్రవృత్తి, హింస, చీకట్లలోంచి వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తున్న చీకటి మనుషుల న్యాయమైన, సహజమైన ఆకాంక్ష. దానికి సరైన మార్గాలు కనబడక-సరైన ‘రోల్‌ మోడల్స్‌ కనబడక’- ఆరాటం. బానిసత్వం తప్ప ఇంకేమీ నేర్పని మతం, కుటుంబం.

మనముందే ఉన్నా మనకి కనబడని ఈ బీభత్సాన్ని అసాధారణ ప్రతిభతో- చిత్త ప్రసాద్‌ ఇండియన్‌ ఇంక్‌ డ్రాయింగు లాంటి చిత్రాన్ని-’అభివృద్ధి పథం’లో ఇండియా పటాన్ని ఆవిష్కరిస్తాడు అరవింద్‌. నవలలో ఒకచోట బలరాం అంటాడు, ‘డ్రైవర్‌లు హత్యల వారపత్రికలు చదివితే యజమానులు భయపడవలసిన అవసరం లేదు. కానీ మీ డ్రైవర్‌ గాంధీ, గురించో, బుద్ధుడి గురించో చదవడం మొదలు పెడితే మీరు మీ ప్యాంటులో ఉచ్చపోసుకోవాల్సిన సమయం వచ్చినట్టు’ అని. ఎంత నిజం. హత్యలూ, నేరాలూ చేసినవాళ్ళే సాధారణంగా క్షణికావేశానికి లోనైనవాళ్ళు. వాళ్ళకి కుటుంబం, సంఘం బంధనాలు ఉంటాయి. గాంధీ, బుద్ధుడూ ఆ సంకెళ్ళు విడగొట్టుకుని అనుకున్న దారిలో స్థిరనిశ్చయంతో వెళ్ళిన మనుషులు.

ఒక మనిషి వాళ్ళ జీవితాలు తెలుసుకుని ఆ ధైర్యం నేర్చుకుని, చుట్టు పక్కల సమాజంలో అలాంటి ఉన్నతమైన ఆదర్శానికి ప్రతీకలు కనబడకపోతే ఎంత విధ్వంసం సృష్టించగలిగే మృగంగా అవగలడూ? మన ‘అభివృద్ధి పథం’ అలాంటి మృగాలనీ, ఆ హింసని ఎంత నియంత్రించగలదూ? భారతదేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేవాళ్ళందరూ తప్పకుం డా ఈ పుస్తకాన్ని చదవాలి. మరుసటిరోజు మీరు ఆఫీసుకి జ్వరమని సెలవు పెట్టాల్సి వచ్చినా బెంగపడకండి. మనం ఒకరోజు పనెగ్గొడితే ఆగేదికాదు ఈ అభివృద్ధి రథం. ఈ పుస్తకం చదివి బలరాంలు నోరు తెరిచినప్పుడు వాళ్ళని ఒక నిమిషమైనా మాట్లాడనివ్వాలనే స్ప­ృహ మనకు కలిగితే, అదే ఎప్పుడైనా మన ప్రాణం కాపాడవచ్చు.

By - రమణ
జాక్సన్‌విల్‌, ఫ్లోరిడా

From: Andhrajyothy